వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్.. అంటూ.. మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు చెప్పినట్టుగ ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మంగళవారం అశేష జన సందోహం నడుమ ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలు సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తుల రాక ఇంకా కొనసాగుతూనే ఉంది. సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నట్టు జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు.
బలభద్ర సుభద్ర జగన్నాథుడి విగ్రహాల ను గుండిచ ఆలయం వరకు రథ యాత్ర తో తోడ్కొని వెళతారు. 12వ శతాబ్దం నాటి మందిరం ముందు ఉంచుతారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున 80 ప్లాటూన్ల బలగాల ను మోహరించారు. ఒక్కో ప్లాటూన్ లో 30 మంది పోలీసులు ఉంటారు. సాగరతీరం కావడంతో తీరంలో కోస్ట్ గార్డ్ కు చెందిన హెలికాప్టర్ సైతం గస్తీ నిర్వహిస్తోంది.
పూరీ రథయాత్ర నేపథ్యంలో 125 ప్రత్యేక రైళ్ల ను రైల్వే శాఖ నడుపుతోంది. పూరీ రథయాత్ర ప్రారంభానికి ముందు ఢిల్లీ లోని హౌజ్ కాస్ లో ఉన్న జగన్నాథ్ మందిరం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు నిర్వహించారు. పూరీ రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
“ఈ పవిత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా జగన్నాథ స్వామి మన జీవితాల ను ఆరోగ్యం సంతోషం ఆధ్యాత్మిక భావనలతో నిండుగా ఉంచాలని కోరుకుంటున్నాను” అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ప్రజల కు శుభాకాంక్షలు చెప్పారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్ ధర్మేంద్ర ప్రధాన్ పూరీ చేరుకున్నారు. పూరీ శంకరాచార్య స్వామి అయిన నిశ్చలానంద సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు.