లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ.. భారతీయ జనతా పార్టీ అసలు సిసలు రాజకీయానికి తెర తీసినట్టయింది. ఇన్ని సంవత్సరాలుగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ వచ్చిన మిత్రపక్షానికి హ్యాండిచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటును కేటాయించలేదు.
అదే సమయంలో దాని ప్రత్యర్థి పార్టీని ప్రోత్సహించింది బీజేపీ. పొత్తు కూడా పెట్టుకుంది. సీట్లనూ కేటాయించింది. ఈ పరిణామాలు ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో కలకలానికి దారి తీసింది. బీజేపీ హైకమాండ్ తమకు అన్యాయం చేసిందంటూ ఆ పార్టీ అధినేత, కేంద్ర మంత్రి తన పదవికి సైతం రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆ మంత్రి పశుపతి కుమార్ పరాస్. దివంగత నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్కు సోదరుడు. రాష్ట్రీయ లోక్జనశక్తి పార్టీ అధినేత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఆయన స్వరాష్ట్రం బిహార్. అక్కడి హాజీపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
2019 నాటి ఎన్నికల్లో ఎన్డీఏతో పొత్తుకుంది రాష్ట్రీయ లోక్జనశక్తి పార్టీ. అయిదుమంది ఎంపీల బలం ఉంది. ఈ ఎన్నికల్లో ఆర్జేఎల్పీతో పొత్తు పెట్టుకునే ఊసే ఎత్తలేదు బీజేపీ. బిహార్లో గల 40 లోక్సభ నియోజకవర్గాల్లో 17 చోట్ల తాను పోటీ చేయనుంది. 16 స్థానాలను జనతాదళ్ (యునైటెడ్)కు కేటాయించింది. మరో అయిదింటిని చిరాగ్ పాశ్వాన్కు చెందిన లోక్ జన్శక్తి పార్టీకి ఇచ్చింది.మిత్రపక్షంగా ఉంటోన్న రాష్ట్రీయ లోక్ జన్శక్తికి మొండి చెయ్యి చూపింది. దీనితో పశుపతి కుమార్ పరాస్ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అయిదు సంవత్సరాలుగా ఎన్డీఏలో మిత్రపక్షంగా కొనసాగినప్పటికీ.. బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.