హీటెక్కిన విశాఖ పాలిటిక్స్ : ఎంవీవీ వైసీపీకి దూరమేనా…?

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వైసీపీకి దూరమవుతున్నారా. ఆయన మాటలు ఆవేదన వ్యవహార శైలి చూస్తే అలాగే అనిపిస్తోంది అని అంటున్నారు. మరో వైపు ఆయనకు వైసీపీ  అధినాయకత్వంగో పెద్ద గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు. లేటెస్ట్ గా ఆయన తన వ్యాపారాలు అన్నీ ఇక మీదట హైదారాబాద్ కి షిఫ్ట్ చేసుకుంటాను అని ఒక పవర్ ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఏపీలో వైసీపీని ఇబ్బంది పెట్టేలా ఉంది.



వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అలాంటిది సొంత పార్టీకి చెందిన ఎంపీ విశాఖలో బిగ్ షాట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా సొంత ప్రభుత్వం మీద నమ్మకం లేకనే ఈ విధంగా హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతాను అని అంటున్నారని తెలుస్తోంది. తాను ఒక కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేసానని అక్కడ భూమిలో రాయి ఉందని బ్లాస్టింగ్ కోసం ప్రభుత్వాన్ని అనుమతి అడిగితే ఇప్పటికి నలభై అయిదు రోజులు గడచినా ఇవ్వలేదని ఆయన నేరుగా మీడియా ముందే తన బాధ వెళ్ళగక్కేశారు.

దీన్ని బట్టి చూస్తూంటే వైసీపీ ప్రభుత్వం తీరు మీద చాలా విషయాల్లో ఎంపీకి అసంతృప్తిగా ఉందని ఇన్నాళ్ళకు ఆయన బయటపడ్డారని అంటున్నారు. మరో వైపు ఎంపీని కట్టడి చేసేందుకు చూస్తున్నారని కూడా అంటున్నారు. ఆయన తాను ఎంపీని అయినంతమాత్రాన వ్యాపారాలు చేసుకోవద్దా అని కూడా గతంలో ఒకసారి మాట్లాడిన సందర్భం ఉంది.

అధికార పార్టీకి చెందిన ఎంపీకి సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది. ఆయన సులువుగా వ్యాపారాలు చేసుకుంటారు. జోరు చూపిస్తారు. కానీ ఎంపీ ఎంవీవీ విషయంలో మాత్రం ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదని ఎంపీ అనుచరుల నుంచి వస్తున్న మాట. అయితే ఎంపీ చేసే ప్రాజెక్టులు వివాదాస్పదం కావడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే అనుమతుల విషయంలో వెనకా ముందు ఆడుతున్నారని మరో కధనం ఉంది.

ఏది ఏమైనా ఆయన సౌండ్ పార్టీ అని మాత్రమే వైసీపీ ఆయనకు విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చింది. అయితే ఇపుడు ఆయన వ్యవహార శైలి చూస్తే ఓపెన్ అయిపోయారు. గతంలో చూస్తే ఆయనకు విజయసాయిరెడ్డికి మధ్య వివాదాలు వస్తే దాన్ని వైసీపీ హై కమాండ్ సెట్ చేసింది. ఇపుడు మాత్రం ఎంపీ ముందుకే పోతున్నారని ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీకి రారు అని అంటున్నారు.

ఇంకో వైపు విశాఖ ఎంపీ సీటు ఆయనకు ఇవ్వాలని మొన్నటి దాకా అనుకున్నా కిడ్నాప్ ఉదంతం తరువాత ఆయనకు ఇవ్వకపోవచ్చు అన్న టాక్ వస్తోంది. ఇంకో వైపు ఎంపీకి టీడీపీ నుంచి మద్దతు పెరగడం ఆయన కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో ఇక వైసీపీకి ఎంపీ దూరమే అని అంటున్నారు. మరో వైపు చూస్తే విశాఖ ఎంపీ హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటున్నారు ఆయన్ని అంతలా వైసీపీ పెద్దలు భయపెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వెనకేసుకొచ్చిన వైనాన్ని వైసీపీ నిశితంగా పరిశీలిస్తోంది అంటున్నారు. దీంతో ఎంపీకి టికెట్ రాదనే అంటున్నారు.

అదే సమయంలో తాను కోరుకున్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే టికెట్ విషయంలో వైసీపీ హై కమాండ్ హామీ ఇవ్వలేదని పైగా మరోసారి ఎంపీగా పోటీ చేయమనడం పట్ల ఎంవీవీ చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారని టాక్. ఇపుడు సమయం సందర్భం రావడం తో ఆయన ఓపెన్ అవుతున్నారని అంటున్నరు. ఏది ఏమైనా విశాఖ నుంచి మరో రెబెల్ ఎంపీ వైసీపీకి రాబోతున్నారా అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these