చిత్తూరు జిల్లాలోనే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, అప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూనే ఉన్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర (Swarna Andhra – Swachh Andhra) కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలకు వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఒకప్పుడు టెక్నాలజీని తక్కువ చేసి మాట్లాడారని, కానీ నేడు అదే టెక్నాలజీ రాష్ట్ర సంపదను పెంచుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ డాక్టర్ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించే స్థితి వస్తుందని ఆయన అంచనా వేశారు. ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రజలపై భారం లేకుండా..
విద్యుత్ రంగంలో గత పాలకులు ఐదేళ్లలో రూ.32 వేల కోట్ల మేర ఛార్జీలు పెంచారని విమర్శించారు. ప్రజలపై భారం మోపేలా విధించిన రూ.4,600 కోట్ల డ్యూటీని రద్దు చేశామని తెలిపారు. ప్రతి యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.5.19 ఖర్చవుతున్నా, ప్రజలపై భారం లేకుండా యూనిట్కు 39 పైసల మేర తగ్గించగలిగామని, త్వరలో మరింత భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
వ్యవసాయ రంగంలో మార్పులపై మాట్లాడిన సీఎం, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఎరువులు, పురుగుమందుల అతి వినియోగం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే ప్రణాళికను త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని ఆయన అన్నారు.
భయంకరమైన పాలన..
2019-24 మధ్యకాలాన్ని తీవ్రంగా విమర్శించిన సీఎం, ఆ సమయంలో రాష్ట్రంలో భయంకరమైన పాలన నడిచిందన్నారు. తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి కోర్టుకు కూడా వెళ్లనీయకుండా తనను జైలుకు పంపారని ఆరోపించారు. అయినా ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వచ్చామని, సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సాధిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
అమరావతిని నిర్మించి తీరుతా..
అమరావతి (Amaravati) పై కూడా స్పష్టంగా స్పందించిన చంద్రబాబు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రపంచ శ్రేణి నగరంగా అమరావతిని నిర్మించి తీరుతామని ప్రకటించారు. రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడాలని, ప్రజల భవిష్యత్తో ఆటలాడకూడదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాలను ప్రగతిపథంలో నడిపిస్తామని చెప్పారు.
ఎవరెన్ని కుయుక్తులు చేసినా..
అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరని సీఎం స్పష్టం చేశారు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో.. గత పాలకుల హయాంలో కేంద్ర పథకాలను సరిగా వినియోగించుకోలేదని, రోడ్లు, తాగునీరు, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఈగల్’ వ్యవస్థ ద్వారా గంజాయి నియంత్రణ సాధించామని తెలిపారు. ఉద్యోగులు, పేదల కోసం నిలిపేసిన పథకాలను మళ్లీ ప్రారంభించి, రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కష్టపడి పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు
