కలెక్టర్లూ.. జిల్లా రూపు రేఖల్ని మార్చండి : చంద్రబాబు

కలెక్టర్లూ.. జిల్లా రూపు రేఖల్ని మార్చండి : చంద్రబాబు

కూటమి ప్రభుత్వం పదిహేను నెలల పాలన పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. భారత్ నెంబర్ 1 కావాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, భారత ఆర్ధిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4 స్థానానికి చేరుకుందని తెలిపారు. గతంలో అమెరికాను అగ్రస్థానంలో చూసేవాళ్లం. ఇప్పుడు భారత్ ఆ దేశానికి సమాన స్థాయికి వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మరో 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి అవుతుందని, ఆ సమయానికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానిది ఓ నిర్దుష్టమైన విధానం ఉందని తెలిపారు. కేంద్రం 2047 వికసిత్ భారత్ ప్రణాళిక తయారుచేస్తే ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించిందని, ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని కోరారు. సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకూ సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియమాకాలు చేశామన్న చంద్రబాబు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ మంత్రులను నియమించి కేబినెట్ కూర్పు చేశామని చెప్పారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ తో…

డబుల్ ఇంజన్ సర్కార్- డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్న ఆయన 2047 వరకూ 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కలెక్టర్ల సదస్సు ద్వారా జరిగే చర్చలో ప్రతీ నిముషం సద్వినియోగం కావాలని, ప్రస్తుతం వృద్ధిరేటు 10.5 శాతం ఉందని, ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని రూ.3.47 లక్షలకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. 2029 నాటికి రూ.29 లక్షల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అప్పటికి రూ.4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా మనం పనిచేయాలని, ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అందరినీ సాధికారిత దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని విశ్వసించే ఎన్డీఏ కూటమికి ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని, జిల్లా రూపు రేఖల్ని మార్చటంలో వారిదే ప్రధాన బాధ్యత అని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసేది కలెక్టర్లేనని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these