టీడీపీ పార్లమెంట్ కమిటీలపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 34 మంది సభ్యులతో పార్లమెంట్ కమిటీ ఏర్పాటు కానుంది. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులతో పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, మీడియా కార్యదర్శులకు ఇందులో స్థానం కల్పించారు.28 మందితో పార్లమెంట్ స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీలపైనా అభిప్రాయాల సేకరణ చేయనున్నారు. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి పార్లమెంట్ స్థాయిలో 54 సాధికార సమితిలు ఏర్పాటు కానున్నాయి.
పార్లమెంట్ పరిధిలోని పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ తీసుకోనుంది. వీటిపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీల్లోని 75 మంది నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు.