ఏపీ ప్రభుత్వం మరో ప్రధాన పథకం అమలు పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయం లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పైన తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 12న వేసవి సెలవుల తరువాత బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అమలు తేదీ పైన స్పష్టత ఇంకా ఇవ్వలేదు. కాగా, తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫిరెన్స్ సమయంలో తల్లికి వందనం అమలు తేదీ పైన కీలక ప్రకటన చేసారు. అయితే, తుది మార్గదర్శకాల పైన సస్పెన్స్ కొనసాగుతోంది.
ముహూర్తం ఖరారు
ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్దమైంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు సమయం సమీపించింది. 2025-26 వార్షిక బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటి కే పలు మార్లు స్పష్టం చేసింది. కాగా, తాజాగా పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్ సమయంలో చంద్రబాబు ఈ నెల 12 లేదా 14వ తేదీన ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేసారు.
ఒకే విడతలో
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఈ నెల 12వ తేదీకి ఏడాది పూర్తి అవుతుంది. అదే రోజున పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండంటంతో నిధుల విడుదల అదే రోజు పూర్తి చేయాలనే తాజా ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. సాధ్యం కాకుంటే 14న విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే, ఆర్దిక సమస్యల కారణంగా రెండు విడతల్లో పథకం అమలు చేయాలనే ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం ఆర్దిక శాఖ అధికారుల నుంచి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడు దల సమయంలో తల్లికి వందనం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభం లోగా ఇస్తామని చెబుతూనే… ఒక ఇన్ స్టాల్ మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. దీంతో, ఒకే విడతలో రూ 15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ 7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. అయితే, ఒకే విడతలో ఇవ్వటం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మార్గదర్శకాలు
ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య… కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి 2025-26 బడ్జెట్లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. ప్రాధమికంగా ఈ పథకానికి 69.16 లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇదే సమయం లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. ఆదాయ పన్ను చెల్లింపు దారులు..తెల్ లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియో గం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.