ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరు నెలలు పూర్తయింది. అంతలోనే రాష్ట్రంలో మరో ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఈసీ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు,కార్పొరేషన్ లలో ఖాళీగా ఉన్న చైర్ పర్సన్ ,వైస్ ఛైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ ల ఎంపిక కోసం ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30లోగా ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల మూడో తేదీన పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ ల పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహిస్తారు.
అలాగే బుచ్చిరెడ్డిపాలెం,నూజివీడు,తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్ పర్సన్ ల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి.ఆయా మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఆయా చోట్ల ఎన్నికల నిర్వహణకు వీలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ఇంకా గడువు మిగిలి ఉంది. అప్పటి వరకూ ఈ ఎన్నికల్లో ఎన్నికైన వారు ఆయా పదవుల్లో కొనసాగుతారు.
