రాష్ట్రంలో మాదకద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ జూపల్లి కృష్ణా రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి, డీజీపీ శ్రీ రవి గుప్తా, ఇంటలీజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శ్రీ శివధర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి శ్రీ శేషాద్రి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
