Andhra Pradesh: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని ఘోరం..

ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని ఘోరం..

కన్నతల్లి పెట్టిన గోరుముద్దలు ఇంకా గొంతు దాటనే లేదు.. అమ్మ ఒడిలో చేసిన గారాలు ఇంకా తీరనే లేదు.. ఇంతలోనే ఆ పసికందు పాలిట మృత్యువు పామై వచ్చింది. ఆడుకుందామని ఆరుబయటకు వెళ్లిన ఆ మూడేళ్ల చిన్నారిని పాము కాటేయడంతో ఆ ఇంటి దీపం ఆరిపోయింది.

కన్న తల్లిదండ్రులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటారు. వారి భవిష్యత్ కోసం పిల్లలు పుట్టినప్పటినుంచి అనేక రకాలుగా ఆలోచనలు చేస్తారు. కానీ వారి కలలు చెట్ల ఆకుల్లా ఒక్కసారిగా రాలిపోతే ఆ భాద భరించటం ఎవరివల్లా కాదు. అప్పటివరకు అమ్మ ఒడిలో గారాలు పోయిన మూడేళ్ల పసికందు ఇంటిముందు ఆడుకునేందుకు వచ్చింది. అదేసమయంలో అక్కడే ఉన్న త్రచూపాము బాలికను కాటేసింది. తల్లి బిడ్డ కనిపించకపోవడంతో ఇంట్లోనుంచి వచ్చేలోగానే ఈ ఘోరం జరిగిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన తీగల ప్రకాష్ , ధనలక్ష్మి వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. మొదటి బిడ్డకు ఆరేళ్లు, రెండో కూతురుకు 3 ఏళ్ల వయస్సు ఉంటుంది. అప్పటివరకు తల్లి ఒడిలో ఆడుకుని గోరుముద్దలు తిన్న చిన్నారి హన్సిక ఆటవిడుపుగా ఆరు బయటకు వెళ్లి ఆడుకుంటూ, అచేతనంగా పడిపోయింది. చుట్టూ పరిసరాలు చూసేసరికి ఆరు బయట గడ్డి మధ్య త్రాచుపాము పాము కనపడింది. భయంతో ఆమె వేసిన అరుపులకు చుట్టుపక్కల ఉన్న స్థానికులు చేరుకుని గడ్డి మధ్యలో పడగవిప్పి బుసలు కొడుతున్న పాముని కర్రలతో కొట్టి చంపారు. వెంటనే పాపను నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స చేసినా బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే విష ప్రభావంతో బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these