రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. అన్నదాతలకు ప్రత్యేక ఆహ్వానం

రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. అన్నదాతలకు ప్రత్యేక ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి తొలిసారి గణంతంత్ర దినోత్సవ వేడుకలకు వేదిక అయ్యింది. అమరావతి వైభవాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీన నేలపాడులోని హైకోర్టు భవనంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరిపేందుకు రెడీ అయ్యింది. రాజధానిలో జరగబోయే ఈ వేడుకల కోసం శరవేగంగా ఏర్పాట్లు కొసాగుతున్నాయి.

అమరావతి బ్రాండింగ్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వప్రయత్నాలు చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని శాశ్వత ముద్రవేసేందుకు పార్లమెంట్‌లో బిల్లు కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. నిన్నటి వరకూ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లిన దావోస్‌లోనూ అమరావతిని ప్రమోట్ చేశారు. 2027 టార్గెట్‌గా ఇటు నిర్మాణాలనూ పరుగులు పెట్టిస్తున్నారు. వీటితోపాటు రాజధానిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిత్యం ఏదో ఒక ఈవెంట్‌నూ ప్లాన్ చేస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పిలిచి కూటమి తొలి వార్షికోత్సవ సభ అమరావతిలోనే కాదు.. ఆ తర్వాత ఆవకాయ పేరుతో ఫెస్టివల్‌ జోష్ కూడా అమరావతి నుంచే తెచ్చారు. ఇక ఇప్పుడు గణంతంత్ర దినోత్సవ వేడుకలను తొలిసారి అమరావతిలోనే జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేలపాడులోని హైకోర్టు భవనం సమీపంలో విశాల ప్రాంతంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేందుకు అరేంజ్‌మెంట్స్‌ నడుస్తున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ సహా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు అతిధులు వేడుకలకు హాజరవుతున్న నేపద్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

గణతంత్ర వేడుకల కోసం 22 ఎకరాల పైగా విస్తీర్ణంలో పరేడ్ గ్రౌండ్‌ను శరవేగంగా నిర్మిస్తున్నారు. 15 ఎకరాల్లో వీవీఐపీ, వీఐపీ పార్కింగ్, 25 ఎకరాల్లో పబ్లిక్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం, రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీను ఏర్పాటు చేశారు. అమరావతి కోర్ సిటీలో రిపబ్లిక్ వేడుకలు అత్యంత వైభవంగా జరగేలా రిపబ్లిక్ డే వేడుకలు అత్యంత వైభవంగా జరగేలా ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

రైతులకు ప్రత్యేక ఆహ్వానం

అమరావతి భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయడం విశేషం. రైతులు వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ అధికారులు ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రైతులు, ప్రజలు హాజరయ్యేలా సమన్వయం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలకు వచ్చే వీవీఐపీలు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ట్రాఫిక్, భద్రత, పార్కింగ్ అంశాలపై ముందుగానే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు. అమరావతి వేదికగా జరుగుతున్న ఈ రిపబ్లిక్ డే వేడుకలు రాజధాని ప్రాధాన్యతను మరోసారి చాటనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these