జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, సర్వేల అంచనాలకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వర్గానికే చెందిన కీలక వ్యక్తి బీఆర్ఎస్ (BRS) గూటికి చేరడం రేవంత్ రెడ్డికి, స్థానిక కాంగ్రెస్ నాయకత్వానికి భారీ షాక్గా మారింది.
నవీన్ యాదవ్కు సొంత తమ్ముడు వరుసైన గౌతం యాదవ్ గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గౌతమ్ యాదవ్ అధికారికంగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్, గౌతమ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను గెలిపించడానికి పూర్తి స్థాయిలో పని చేయాలని గౌతమ్ను కేటీఆర్ ఆదేశించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తలసాని సాయి యాదవ్, నగేష్ ముదిరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీలోకి చేరిన వారికి దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని , కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించి తీరాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యుడే ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై పెను ప్రభావాన్ని చూపనుంది. ఈ పరిణామం బీఆర్ఎస్ విజయావకాశాలను మరింత బలోపేతం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
