వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృత నకిలీ మద్యం మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇంతటి పెద్ద నకిలీ మద్యం మాఫియాను గతంలో ఎన్నడూ చూడలేదని, ప్రపంచ చరిత్రలో కూడా ఇలాంటిది అరుదని ఆయన వ్యాఖ్యానించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు రాష్ట్రవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బెల్ట్ షాపులు, అక్రమ పర్మిట్ రూమ్ల ద్వారా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆయన తెలిపారు. ఈ మాఫియాకు పోలీస్ రక్షణ కూడా ఉందని, ఇటీవల మొలకల చెరువులో 20,208 నకిలీ మద్యం బాటిళ్లు, 8,166 బాటిళ్లకు సరిపడా మద్యం పట్టుబడటం దీనికి నిదర్శనమని జగన్ వివరించారు.
