Tenali Incident: నడిరోడ్డుపై పట్టపగలు తెనాలి పోలీసుల లాఠీఛార్జ్.. జాల్లా ఎస్పీ స్పందన ఇదే!

నడిరోడ్డుపై పట్టపగలు తెనాలి పోలీసుల లాఠీఛార్జ్.. జాల్లా ఎస్పీ స్పందన ఇదే!

తెనాలిలో ముగ్గురు యువకులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపై లాఠీలతో కొట్టసాగాడు. నొప్పి తట్టుకోలేక కాళ్లు వెనక్కి తీసుకుంటే కాళ్లు సరిగ్గా పెట్టమని గద్దించగా.. మరో పోలీస్ ఆ యువకుడి కాళ్లు కదలకుండా కాళ్లపై తన కాలు బలంగా అదిమిపెట్టి కొట్టాడు. పరుషమైన భాషలో తిడుతూ, కొడుతున్న ఈ వీడియో తెనాలిలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐతా నగర్‌లో చోటు చేసుకుంది. ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో పోలీసు శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసలేం జరిగిందంటే..

బాబూలాల్, చేబ్రోలు జాన్‌ విక్టర్, డోమా రాకేష్ అనే ముగ్గురు యువకులను వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిరంజీవిపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 27న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతే కాకుండా వారిపై పలు కేసులు, రౌడీషీట్లు కూడా జారీ చేశారు. అనంతరం వారిని ఐతానగర్ ప్రాంతానికి తీసుకెళ్లి నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీనతో కొట్టారు. టూ టౌన్‌ సీఐ రాములు నాయక్‌, త్రీ టౌన్‌ సీఐ ఎస్‌ రమేష్‌ బాబు నడిరోడ్డు మీద వారిని అరికాళ్లపై లాఠీలతో కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యువకులు దెబ్బలకు తాళలేక కాళ్లు ముడుచుకోగా.. సీఐ రాముల నాయక్‌ బూటు కాళ్లతో తొక్కి కొట్టడం వీడియోలో కనిపిస్తుంది.

గంజాయి మత్తులో కానిస్టేబుల్‌పై దాడి చేశారంటూ ఆ ముగ్గురు యువకులను చావబాదడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. నిందితులు తప్పుచేసినట్లు భావిస్తే అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరు పరచాలి. అంతేకానీ ఇలా దాడికి తెగబడం ఏంటని కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. తప్పు చేసినా.. నిందితులను కొట్టే హక్కు పోలీసులకు లేదని చట్టం చెబుతుంది. కానీ నిబంధనలు తుంగలో తొక్కి రక్షణ ఇవ్వవల్సిన పోలీసులే ఇలా అమానుషంగా ప్రవర్తించడం ఏంటని మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఏంటని ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడంతో లాఠీ ఛార్జీ చేయడంతో దీనిపై ఎస్పీ సతీష్ తాజాగా స్పందించారు.

తెనాలి అరికాలి కోటింగ్ వైరల్ వీడియోపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ స్పందన..

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ దీనిపై స్పందిస్తూ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో కేసు పరిశీలనలో ఉందన్నారు. నెలరోజుల క్రితం ఐతానగర్‌లో గంజాయి మత్తులో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడికి పాల్పడ్డ విక్టర్, బాబూలాల్, రాకేష్‌లు.. ఇప్పటికే పలు క్రిమినల్ కేసులలో రౌడీషీటర్లు. కేసు నమోదు చేసి నిందితులపై చట్టబద్ధంగా  తెనాలి పోలీసులు చర్యలు తీసుకున్నారు. నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ విధించిన ఘటనలో.. పోలీసుల చర్యలపై అనవసర ప్రచారం జరుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాధ్యతాయుతంగా పోలీసులు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ శాఖ న్యాయం, పారదర్శకతకే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

మా పిల్లలపై తప్పుడు కేసులు: బాధితుల కుటుంబ సభ్యులు

పోలీసుల ఒత్తిడి వల్లే గొడవ జరిగిందని బాధిత యువకుల తల్లిదండ్రులు అంటున్నారు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరై ఇంటికి వస్తున్న మా పిల్లలను సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి అడ్డగించడంతో ఘర్షణ జరిగింది. తాను పోలీస్‌ అని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ చేయి చేసుకోవడంతో గొడవ కాస్తా ముదిరిందని చెబుతున్నారు. దీంతో సదరు పోలీసు.. యువకులపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు ఉపక్రమించారని అన్నారు. కాగా గత నెలలో ఈ సంఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these