కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ.. పవన్‌పై జగన్ ఘాటు వ్యాఖ్యలు..

కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ.. పవన్‌పై జగన్ ఘాటు వ్యాఖ్యలు..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు.. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీట్ల ప్రకారం వైసీపీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదన్న పవన్ కళ్యాణ్.. ఓట్ల శాతం ప్రకారం లెక్కలేస్తే వైఎస్ జగన్ జర్మనీకి వెళ్లాలంటూ సెటైర్లు వేశారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్ వద్ద.. విలేకర్లు ప్రస్తావించారు. దీంతో పవన్ కళ్యాణ్‌పై వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారంటూ ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, వైసీపీకి ప్రతిపక్ష హోదా అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఇంత మంది సభ్యులు ఉండాలనే రూలింగ్ ఎక్కడా లేదన్నారు. 175 మందిలో ఒకరికి ఇచ్చిన టైమ్ ఇస్తామంటే ఎలా అంటూ జగన్ ప్రశ్నించారు.

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడు సీట్లు ఉన్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. గతంలో చంద్రబాబుకు తాము ప్రతిపక్ష హోదా ఇచ్చామన్న వైఎస్ జగన్.. టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కకు వెళ్లిపోతే.. ఇంకో పదిమందిని వైసీపీలోకి లాగదామని మా వాళ్లు చెప్పినా తాను వద్దన్నట్లు వివరించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎంతసేపైనా అనుమతి ఇచ్చామని.. అదే వారికి, తమకూ ఉన్న తేడానని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

ఇక వైసీపీ వాళ్లకు ఏ పనులూ చేయొద్దంటూ చంద్రబాబు ఎలా అంటారని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పథకాలు ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి ఇదేమైనా చంద్రబాబు గారి ఆస్తా అని ప్రశ్నించారు. ‘ప్రజల సొమ్ముతోనే ప్రభుత్వం నడుస్తోందని.. పాలించే వారు రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగించాలన్నారు. కానీ చంద్రబాబు బహిరంగంగా పథకాలు ఇవ్వొద్దంటున్నారని.. ఇలాంటివారిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలో వద్దో అనేది గవర్నర్, న్యాయమూర్తులు ఆలోచించుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these