కులగణనను నివేదికను కాల్చడంతో పాటు పలు వర్గాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)పై కాంగ్రెస్ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా గత నెల 6న కాంగ్రెస్ క్రమశిక్షణ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కులగణనను నివేదికను కాల్చడంతో పాటు పలు వర్గాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)పై కాంగ్రెస్ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా గత నెల 6న కాంగ్రెస్ క్రమశిక్షణ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని షోకాజ్ నోటీసుల్లో గుర్తు చేసింది. ప్రభుత్వ కీలక విషయాలను పబ్లిక్గా మాట్లాడడం, అలాగే పలు వర్గాలపై అసభ్యకరమైన విధంగా వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలను పార్టీ తప్పుగా ప్రస్తావించింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణా కమిటి కోరింది. అయితే పార్టీ షోకాజ్ నోటీసులకు తీన్మార్ మల్లన్న ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు..
మల్లన్న సస్పెన్షన్ ఎపిసోడ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. ఎంతటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ ముందు కులమతాల ప్రస్తావన ఉండదన్నారు. మల్లన్నకు పార్టీ అన్ని విధాలుగా సహకరించింది. అయినా ఆయన పార్టీ లైన్ దాటారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని.. రాహుల్ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అయ్యారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఇదో హెచ్చరిక అని, భవిష్యత్లో ఎవరైనా పార్టీలైన్ దాటితే చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్.. ఈ నిర్ణయంతో పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించబోమని సంకేతాలు ఇచ్చారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.